Friday, March 30, 2012

మనకు తెలియని ఆసక్తికర నిజాలు...!!! ఆరవ భాగం


  1. చిలుక తన ముక్కుతో  350 పౌండ్స్/ చ.అ  ల బలం ఉపయోగించి కొరకగలదు...!!!
  2. గుడ్ల గూబ చూపుడు శక్తి మానవుడి చూపుడు శక్తి కంటే 82 రెట్లు ఎక్కువ ఉంటుంది.
  3. ఒక పౌండ్ యురేనియం లో ఉన్న అణువులు విచ్చిన్నం చెందితే విడుదలయ్యే శక్తి  మూడు మిలియన్ పౌండ్ ల బొగ్గు ని తగలబెడితే వచ్చే శక్తికి సమానంగా ఉంటుంది.
  4. మన శరీరంలో ప్రతి క్షణం 15 మిలియన్ల రక్త కణాలు తయారవుతాయి మరియు నాశనం అవుతాయి....!!!
  5. మనం పళ్ళు తోముకునే పేస్టు లో సుద్ద( Chalk ) కలుపబడి ఉంటుంది. ఈ సుద్ద వలన పేస్టు కి క్షార గుణం వుంటుంది. మన పళ్ళ మీద పేరుకు పోయిన షుగర్ ఉత్పత్తి చేసే ఆమ్లాన్ని పేస్టు లో ఉండే ఈ క్షారం తటస్థం చేసి మన పళ్ళను కాపాడుతుంది.
  6. శక్తి ని కొలిచే పదం వాట్ ని స్టీమ్ ఇంజన్ కనిపెట్టిన జేమ్స్ వాట్ గౌరవార్ధం పెట్టారు.
  7. మానవుడు తన జీవిత కాలంలో సగటున లక్ష లీటర్ల నీటిని తాగుతాడు .

Source :IGNOU / GV

Friday, March 09, 2012

పుజారులమీద కేసు పెడతా, ఎన్.టి.ఆర్ మీద ఫిర్యాదు చేస్తా...!!! పూజారుల మీద చేసిన వ్యాఖ్యల వివాదంలోకి జూనియర్ ఎన్.టి.ఆర్ ని లాగే ప్రయత్నం చేసిన రాంగోపాల్ వర్మ గారు...!!!సినీ పరిశ్రమలో మరో వివాదానికి తెర లేయనుందా...!!!

                            పూజారులు మంత్రాలు సరిగా చదవకపోవడం వల్లనే పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయని ట్వీటిన ( ట్విట్టర్ర్ లో రాసుకున్నారు) వర్మగారు ఇప్పుడు ఈ విషయం పెద్ద రచ్చకు దారి తీసే సరికి పూజారుల మీద ఎదురు దాడికి దిగారు. దీనికి సంభందించి నిన్న ట్విట్టర్ర్ లో మరి కొన్ని కామెంట్లు పెట్టారు. అయితే ఈ వివాదం లోకి జూనియర్ ఎన్.టి.ఆర్ ని లాగే ప్రయత్నం చేసారు వర్మ గారు. ఆయన నిన్న ట్విట్టర్ర్ లో ఏం రాసారో మీరు ఒక సారి చదవండి.
  • కొందరో, అందరో, అనుకుంటున్నట్టుగా నేను బ్రాహ్మణులకి వ్యతిరేకిని కాదు కానీ, పూజారులకి వ్యతిరేకిని. కానీ దేవుడిని ప్రేమిస్తాను. 
  • అందరి దేవుళ్ళని ప్రేమించను, కేవలం కొంతమంది సెలెక్టేడ్ దేవుళ్ళని మాత్రమే ప్రేమిస్తాను
ఇంతవరకు బాగానే ఉంది.... అసలు కథ అంతా ఇక్కడే మొదలవుతుంది. తరవాత ఏమన్నారో చదవండి.
  • నా పూజారుల మీద కామెంట్ల కంటే ఎన్.టి.ఆర్ అదుర్స్ లో చేసింది ఎక్కువ , కానీ తను స్టార్ కనక నేను ఫ్లోప్ డిరెక్టర్ కనక పూజార్లు నన్ను టార్గెట్ చేస్తున్నారు. 
  • ఈ విషయం మీద నేను జూ. ఎన్.టి.ఆర్ మీద , పూజారుల మీద ఎండోమెంట్ మినిస్ట్రీ లో కంప్లైంట్ ఇస్తా...!!! 
  • పూజారుల మీద జూ. ఎన్.టి.ఆర్ కి నాకు మధ్యన సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ నేరం కింద కేసు పెడతా... 
  • నేను ట్వీట్ లో రాసినదానికి, జూ. ఎన్.టి.ఆర్ అదుర్స్ లో చేసినదానికి కంపేర్ చేస్తే ఏ మూర్ఖుడికైనా నేను చెప్పింది అర్ధమవుతుంది.
                    ఇదండీ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలు. మొత్తం మీద జూనియర్ ఎన్.టి.ఆర్ తన సినిమా లో బ్రాహ్మణులను వెటకారం చేస్తే లేదు గానీ, నేను "వెబ్" కారం చేస్తే వచ్చిందా అని మానిపోయిన అదుర్స్ గొడవని మళ్లీ లేపే ప్రయత్నం చేసారు వర్మగారు. వాస్తవానికి అదుర్స్ సినిమా విడుదలయినపుడు బ్రాహ్మణులు అభ్యంతరం తెలియ చేసారు. వర్మ గారికి ఈ విషయం గుర్తులేదా, లేక కావాలనే ఇలా ఎన్.టి.ఆర్ ని మరోసారి ఇరికించే ప్రయత్నమా అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదేమయినా తాజా వ్యాఖ్యలతో, పూజారులు, జూనియర్ ఎన్.టి.ఆర్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Monday, March 05, 2012

మనకు తెలియని ఆసక్తికర నిజాలు...!!!- ఐదవ భాగం.


మరిన్ని ఆసక్తికర నిజాలతో మరో టపా వచ్చేసింది....చదివేయండి...!!!



  • కొంత మంది వ్యక్తులు వాళ్ళ కళ్ళు తిప్పినపుడు వచ్చే శబ్దాలను కూడా వినగలుగుతారు. ఆశ్చర్య పోకండి...కళ్ళు తిప్పినపుడు వచ్చిన శబ్దం వినడం ఏంటని అనుకుంటున్నారా...!!! నిజమండీ....లోపలి చెవిలో వచ్చే "సుపీరియర్ కెనాల్ డెహిసెన్స్ సిండ్రోం" అనే జబ్బు వున్న వ్యక్తులకి ఇలా జరుగుతుంది. ఈ జబ్బు ఉన్న వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతి శబ్దం యాంప్లిఫికేషన్ జరిగి ప్రతి చిన్న శబ్దం కూడా పెద్దదిగా వినబడుతుంది. ఈ జబ్బుకి చికిత్స కూడా ఉంది.

  • ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు వెలుగుతూ ఉండే జీవమున్న కుక్కని సృష్టించారు. జన్యుపరంగా కొన్ని మార్పులు సృష్టించి శాస్త్రజ్ఞులు ఈ కుక్కని తయారు చేసారు. U.V . కిరణాలు ప్రసరింప చేసినపుడు ఈ కుక్క ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.

  • మనుషులే కాదండోయ్... గుర్రాలు కూడా కృత్రిమ కాలుతో పరుగులెత్తడం మొదలుపెట్టాయి. టెక్సాస్ పట్టణం లో "మిడ్ నైట్" అనే గుర్రం ప్రమాదంలో కాలు పోగొట్టుకుందట. ఆ గుర్రం యజమాని 14 ,000 డాలర్లు ఖర్చు పెట్టి ఆ గుర్రానికి కృత్రిమ కాలు ఏర్పాటు చేయించాడట. వేగంగా కోలుకుంటున్న గుర్రం ఇప్పుడు ఆ కృత్రిమ కాలుతో పరిగెట్టడం కూడా చేస్తుందట.

  • మన ఇంటర్మీడియట్ లో పీరియాడిక్ టేబుల్ గుర్తుండే ఉంటుంది కదా....!!! యూరోప్లో ఒక కెమిస్ట్రీ  విద్యార్ధి తన గురువుగారి పుట్టినరోజునాడు ఆయనను ఇంప్రెస్ చేయడానికి ఏం చేసాడో తెలుసండీ...ఆ గురువుగారి తల వెంట్రుక మీద  పీరియాడిక్ టేబుల్ రాసి బహుమానంగా ఇచ్చాడట...!!! ప్రపంచంలో అతి చిన్న పీరియాడిక్ టేబుల్ ఇదే...!!!

  • ఇక ఈ సంఘటన మన దేశం లోనిదే....హరి ద్వార్ కి చెందిన అమర్ భారతి అనే ఒక సాధువు గత 38 సంవత్సరాలుగా తన కుడి చేతిని పైకి ఎత్తే ఉంచాడట(ఇప్పుడు కూడా )...!!! ప్రపంచంలో జరిగే హింసకు నిరసనగా ఆ హింసను ఆపమని ఇలా చేయి పైకి ఎత్తి నిరసన తెలియ చేస్తున్నాడట. ఇతనితో పాటుగా మరికొంత మంది సాధువులు కూడా ఇలాగే చేస్తున్నారట. కాకపోతే ఈయనంత కాదులెండి.

ఇవండీ ఈ టపా విశేషాలు. మరిన్ని ఆసక్తికర విషయాలతో మరో టపా లో కలుసుకుందాం.

ఆసక్తికర నిజాలు ముందటి భాగాలను చదవడం కోసం ఈ లింకులు నొక్కండి:

Wednesday, February 29, 2012

ఒకే ఒక్క తుఫానుతో అదృశ్యం అయి కాలగర్భంలో కలిసిపోయిన ధనుష్కోటి పట్టణం వివరాలు...!!!

                    ప్రతి సంవత్సరం మనం ఎన్నో వాతావరణ మార్పులు చూస్తుంటాం...ఎండలకు కొంతమంది పండుటాకుల్లా రాలిపోతుంటారు. చలికి కొంతమంది జీవితం గడ్డకట్టుకుపోతుంది. తుఫానులకి కొంతమంది ప్రాణాలు నీటిలో కలిసిపోతుంటాయి. సునామీకి ఊర్లు కొట్టుకుపోవడం కూడా చూశాం. కానీ ఒకే ఒక్క తుఫానుకి ఒక మధ్య తరహా పట్టణం చరిత్రలో కలిసిపోవడం ఎపుడయినా చూసారా...!!! కనీసం చదివారా...!!! ఇది ఇప్పటి సంఘటన కాదు... ఈ సంఘటన జరిగినప్పటికీ మనలో చాలా మంది జన్మించి ఉండరు. కొంతమంది చిన్న పిల్లలుగా ఉండి ఉంటారు.  ఈ పట్టణం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా .... అయితే చదివేయండి.


                               ధనుష్కోటి.... చారిత్రాత్మక పట్టణం...స్వామీ వివేకానంద గారు 1892 లో విదేశీ పర్యటనకు వెళ్లి 1897 లో భారత దేశం తిరిగి వచ్చినపుడు ఇక్కడే కాలు మోపాడు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు జన్మించిన పట్టణం కూడా ఇదే. ఈ పట్టణం రామేశ్వరం పంబన్  ద్వీపానికి చిట్ట చివరన ఉంటుంది. ఇక్కడినుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్లు.   ఇక్కడి నుంచే రాముడు శ్రీలంకకు వెళ్ళడానికి వంతెన ఏర్పాటు చేసుకున్నాడని చరిత్ర చెపుతుంది. ఇక్కడ ఇప్పటికీ ఆ వంతెన తాలుకు అవశేషాలను చూడవచ్చు. ఈ వంతెన శాటిలైట్ చిత్రాలలో కూడా స్పష్టంగా కనబడుతుంది ( పైన చిత్రం లో చూడండి ).హిందూ మహా సముద్రం మరియు బంగాళా ఖాతం ఇక్కడే కలుస్తాయి. రెండు సముద్రాల మధ్యన వర్ణ భేదం స్పష్టంగా చూడవచ్చు. అయితే 1964 లో సంభవించిన ఒక తుఫాను ధాటికి ఈ పట్టణం అంతా కనుమరుగయిపోయింది.


అసలు 1964 డిసెంబర్ 22 అర్ధ్రరాత్రి కి ముందు ధనుష్కోటి ఎలా ఉండేది?
                                1964 కి ముందు ధనుష్కోటి పర్యాటక రంగంలో మరియు పుణ్యక్షేత్రంగా ఒక వెలుగు వెలుగుతూ ఉండేది. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్ల దూరం కావడం వలన అప్పట్లో పర్యాటకులను,సాధారణ ప్రయాణికులను శ్రీలంక చేరవేయడానికి ఇక్కడినుంచి ఫెర్రీ సర్వీసులు కూడా నడిచేవి. పర్యాటకులకు భక్తులకు వసతి కలిపించడానికి ఇక్కడ    హోటళ్ళు, ధర్మశాలలు, బట్టల దుకాణాలు ఉండేవి. భారత భూభాగం నుంచి పంబన్ రైలు వంతెన మీదుగా ధనుష్కోటి పట్టణం వరకు ఒక రైలు మార్గం కూడా ఉండేది.మద్రాసు పట్టణం నుంచి ధనుష్కోటి వరకు బోట్ మెయిల్ అనే పేరుతో ఒక రైలు కూడా నడిచేది. అలాగే ఒక చర్చి, రైల్వే స్టేషన్, రైల్వే ఆసుపత్రి, ఉన్నత విద్యాలయం, పోస్ట్ ఆఫీసు, కస్టమ్స్ మరియు ఓడ రేవు కార్యాలయాలు కూడా ఉండేవి. ఇక రామాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం పూజలతో కళకళలాడుతూ ఉండేసి.


1964 డిసెంబర్ 22 అర్ధ్రరాత్రి ఎం జరిగింది?
                                  1964 డిసెంబర్ 17 న దక్షిణ అండమాన్ ( బంగాళాఖాతం) సముద్రం లో ఏర్పడిన అల్ప పీడనం డిసెంబర్ 19 కి తుఫానుగా రూపాంతరం చెందింది. డిసెంబర్ 22 నాటికి దాదాపు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ధనుష్కోటి పట్టణాన్ని చుట్టి వేసింది. దాదాపు 5 మీటర్ల మేర ఎగసిపడిన అలలు సముద్ర మట్టానికి కేవలం 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో ఉండే ధనుష్కోటి పట్టణం మీద విరుచుకు పడ్డాయి. అగ్నికి ఆజ్యం తోడయినట్లు ఆలల ఉధృతికి భీకరమయిన గాలులు తోడవడంతో కేవలం అరగంట వ్యవధిలో ధనుష్కోటి పట్టణం అంతా నేలమట్టం అయిపొయింది. కేవలం కొన్ని ప్రభుత్వ భవనాల మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఊరు మొత్తం ఇసుక మరియు శవాల దిబ్బగా మారింది. ఇసుకలోనుంచి అన్ని శవాలను బయటికి తీయడానికి దాదాపు వారం రోజులు పట్టిందట. తుఫాను రాకను ముందుగా పసిగట్టి దూరప్రాంతాలకు వెళ్ళిన కొంతమందిని మినహాయిస్తే దాదాపు ఆ రాత్రి ఆక్కడ ఉన్నవాళ్ళందరి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. 1915 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది .

ఆ రోజు ధనుష్కోటి వెళ్ళే పంబన్- ధనుష్కోటి పాసింజర్ రైలు గమ్యం చేరిందా...??? 
                           పంబన్ నుంచి  110 మంది ప్రయాణికులతో 5 గురు రైల్వే సిబ్బందితో  బయలుదేరిన రెగ్యులర్ పాసింజర్ రైలు( ట్రైన్ నంబర్ 653 )మరికొద్ది క్షణాల్లో రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది అన్న సమయంలో అటుగా వచ్చిన భయంకరమయిన అలల ధాటికి సముద్రం లోకి  కొట్టుకు  పోయింది . ఆ సమయంలో  ట్రైన్ లో  ఉన్నసిబ్బందితో సహా అందరూ  జల సమాధి అయ్యారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉందని లేకపోతే మరింతమంది చనిపోయి ఉండే వారని రైల్వే అధికారులు చెప్పారు.




ఆనాటి దుర్ఘటనకు మూగ సాక్ష్యాలు: ఫోటోలు:

చర్చి అవశేషాలు:

గుడి అవశేషాలు :


రైల్వే స్టేషన్ మరియు రైల్వే ఆసుపత్రి అవశేషాలు:


రైలు పట్టాల అవశేషాలు:


ఫెర్రీ సర్వీసు నడిపింది ఇక్కడి నుంచే:


ఘోస్ట్ టౌన్ గా ప్రకటించిన మద్రాసు ప్రభుత్వం.
                           ఈ దుర్ఘటన జరిగిన తరువాత మద్రాసు ప్రభుత్వం ధనుష్కోటి పట్టణం నివాస యోగ్యం కాదని , దానిని ఘోస్ట్ టౌన్ గా ప్రకటించడంతో ధనుష్కోటి పట్టణం చరిత్ర లో కలిసిపోయింది. 


ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ? 
                         ఇప్పుడు అక్కడ కేవలం 5 -6 కుటుంబాల వారు మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. అక్కడికి వచ్చిన యాత్రికులకి మంచి నీరు, తిను బండారాలు అమ్మి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ పర్యాటకరంగం మొగ్గ తొడుగుతుంది. ధనుష్కోటి వరకు నాలుగు లైన్ల రోడ్ వేయాలని, ధనుష్కోటి నుంచి శ్రీలంకకు  ఫెర్రీ సర్వీసులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవన్నీ జరిగి ధనుష్కోటికి పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం.

భారతదేశపు తొలి సముద్రపు వంతెన పంబన్ బ్రిడ్జి వివరాలకోసం ఈ లింకు నొక్కండి.  http://drvenkatasubbareddy.blogspot.in/2012/02/blog-post_5699.html

Tuesday, February 28, 2012

భారత దేశపు తొలి సముద్రపు వంతెన పంబన్ బ్రిడ్జి విశేషాలు..ఇంజనీరింగ్ అద్భుతం ..!!!


                    రామేశ్వరానికి వెళ్ళేదారిలో కనిపిస్తుంది ఈ పంబన్ రైలు మరియు రోడ్  బ్రిడ్జి.ఈ వంతెన  రామేశ్వరం ద్వీపాన్ని మరియు భారత ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది .రైలు వంతెనలు సాధారణం గానే ఉండేవి కదా అని అనుకుంటున్నారా.....!!! నిజమేనండి...కానీ ఈ వంతెన కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండోయ్.... అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి . 

  • ఈ పంబన్ బ్రిడ్జి భారతదేశపు తొలి సముద్రపు వంతెన, 
  • దీని నిర్మాణం బ్రిటిష్ వారికాలం లో 1887 లో మొదలయి 1912 లో పూర్తయింది.
  • భారత దేశం లో ఉన్న సముద్రపు వంతెనలలో ఇది రెండవ అతి పెద్ద సముద్రపు వంతెన.( మొదటిది ముంబై లో ఉన్న బాద్ర- వర్లి సముద్రపు వంతెన) 
  • ఈ వంతెన దాదాపు 2 కిలోమీటర్ల (2065 మీటర్లు) పొడవు ఉంటుంది. ఇది సముద్రం మీద palk జలసంధి మీద నిర్మించారు కాబట్టి ఓడల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి మధ్య భాగం రెండుగా విడివడి పైకి లేస్తుంది.( ఫోటో చూడండి)

  • ఈ వంతెన 2007 కి ముందు మీటర్ గేజ్ మార్గం గా ఉండేది. 2007 ఆగష్టు 12 న బ్రాడ్ గేజ్ మార్గం గా మార్చడం జరిగింది.
  • ఈ బ్రిడ్జి సముద్ర ఉప్పునీటి గాలుల వలన తుప్పుపట్టే అవకాశం ఉన్నాదాదాపు శతాబ్ద కాలం గా  తట్టుకుని నిలబడి ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
  • ఈ బ్రిడ్జి ఉన్న ప్రదేశం అతివేగంగా గాలులు వీచే తుఫాను ప్రభావిత ప్రాంతం లో ఉంది.రైలు లో ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేసేటప్పుడు పడిపోతామేమో అనే భయం కూడా కలుగుతుంది. ( నేను అనుభవించాను కూడా )
  • ఈ బ్రిడ్జి కి 143 స్థంబాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జి మధ్య భాగాన్ని స్విచ్చర్స్ బ్రిడ్జి అంటారు. 
  • ఈ బ్రిడ్జి పక్కనే 1989  లో రోడ్ వంతెనని కూడా అందుబాటులోకి తెచ్చారు.అప్పటి వరకు ఈ రైలు మార్గాన్నే భారత  ప్రధాన భూభాగానికి మరియు రామేశ్వరం, ధనుష్కోటి ద్వీపానికి రాకపోకలకు వినియోగించేవారు.
  • ఈ వంతెన మీద భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళని కూడా విడుదల చేసింది.

  • ఈ వంతెన ప్రవేశం వద్ద ఒక వ్యక్తి  ఏడుస్తూ కొన్ని శరీర అవయవాలు పట్టుకుని నిలబడ్డట్లు ఉంటుందట. ఈ బొమ్మ  గురించి రకరకాల పుకార్లు కూడా ప్రచారం లో ఉన్నాయండోయ్. అందులో అత్యంత ప్రచారం పొందిన పుకారుని ఇక్కడ రాస్తున్నా చూడండి.
                                  ఓడలు వచ్చినపుడు బ్రిడ్జి మధ్య భాగాన్ని పైకి లేపడానికి బ్రిటిష్ వారికాలం లో ఒక మధ్య వయస్కుడిని నియమించారట. ఒక సారి ఓడ వెళ్ళిన తరువాత ఆ వ్యక్తి ఆ వంతెనను సాధారణ స్థితి కి తెస్తుండగా ఒక రైలు రావడం గమనిన్చాడట. ఆ వ్యక్తి ఆ వంతెనను సాధారణ స్థితిలోకి తీసుకు వచ్చేందుకు అతివేగంగా పుల్లీలను తిప్పడం మొదలెట్టాడట. అతను అలా చేయక పోతే ఆ రైలు సముద్రం లో పడిపోయి వేలాది ప్రాణాలు నీటిలో కలిసిపోతాయి.ఈ సమయం లో అతని 9 సంవత్సరాల కుమారుడు ఆ వ్యక్తికి భోజనం తీసుకుని వచ్చాడు. తండ్రి కష్టపడటం చూసి తను కూడా ఆ పుల్లీలను తిప్పడంలో సహాయం చేయసాగాడట. అయితే దురదృష్టవశాత్తు ఈ పుల్లీలను తిప్పే క్రమంలో ఆబాలుడి  చేయి ఆ పుల్లీలకు కలుపబడిన వైర్లలో పడిందట. ఆ బాలుడు నొప్పితో ఏడవ సాగాడట. అయితే వేలాది ప్రాణాలకంటే తన కుమారుడి ప్రాణాలు ముఖ్యం కాదనుకున్న ఆ వ్యక్తి బాలుడి ఏడుపుని పట్టించుకోకుండా ఆ     పుల్లీని తిప్పి బ్రిడ్జి ని సాధారణ స్థితికి తెచ్చి రైలు లో ఉన్న అందరి ప్రాణాలు కాపాడాడట. ఈ లోగా ఆ యంత్రంలో పది ఆ వ్యక్తి కుమారుడి ప్రాణాలు పోగొట్టుకున్నాడట. ఈ వ్యక్తి గొప్పతనాన్ని మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ వంతెన ద్వారం వద్ద ఆ వ్యక్తి బొమ్మని పెట్టిందట. ఈ బొమ్మ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఏడుస్తూ కొన్ని శరీర అవయవాలు పట్టుకుని నిలబడ్డట్లు ఉంటుందట.

    ఇవండీ పంబన్ బ్రిడ్జి విశేషాలు..... ధనుష్కోటి విశేషాలతో మరొక టపాలో కలుద్దాం...!!!

    Saturday, February 25, 2012

    ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మెదడులో ఎలాంటి రసాయనిక మార్పులు జరుగుతాయి....!!! ఆత్మహత్యా భావం వారసత్వంగా వస్తుందా....!!!ఆత్మహత్యల గురించి ఆసక్తికర విషయాలు...విశ్లేషణ....!!!


                          నిన్న నా పి.జి పరిక్షలకు సన్నద్దమవటంలో భాగంగా ఫోరెన్సిక్ మెడిసిన్ చదువుతుంటే ఆత్మహత్యల గురించి ఆ పుస్తకంలో ఉంది . ఆత్మహత్యల మీద సమాచారం బ్లాగర్లతో పంచుకుందాం అనే ఉద్దేశంతో అంతర్జాలం నుంచి, నా మెడికల్ పుస్తకాల నుంచి మరింత సమాచారం సేకరించి క్లుప్తంగా ఈ టపా రాస్తున్నాను.








    ఆత్మహత్యల గురించి మనకు తెలియని నిజాలు:
    1. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షలమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు.
    2. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆత్మహత్య చేసుకుని మరణించే  వారి సంఖ్య 13 వ స్థానం లో ఉంది.
    3. ఆత్మహత్య చేసుకునే స్వభావం స్త్రీలలో కంటే పురుషులలో మూడు నించి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
    4. యుక్తవయస్కులు మరియు 35  సంవత్సరాల లోపు వారే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.



                                ఇక ఆత్మహత్యకు దారితీసే కారణాల గురించి చెప్పుకుంటే , ఆత్మహత్య చేసుకోవడానికి మానసిక వత్తిడి ప్రధాన కారణం. మానసిక వత్తిడికి దారితీసే కారణాల్లో జీవిత భాగస్వామితో సమస్యలు మొదటి స్థానంలో ఉండగా వ్యక్తిగత ఆరోగ్యకారణాలు, ఉద్యోగ కారణాలు, ఆర్ధిక ఇబ్బందులు తరువాత స్థానాల్లో ఉన్నాయి. వీటితో  పాటుగా మానసిక వ్యాధిగ్రస్థులు, మద్యానికి బానిస అయిన వాళ్ళుడ్రగ్స్ కి  అలవాటు పడిన వాళ్ళలో కూడా ఆత్మహత్యా స్వభావం ఎక్కువగా ఉంటుంది.

    ఆత్మహత్య చేసుకోబోయే ముందు మెదడులో ఎలాంటి జీవ రసాయన చర్యలు జరుగుతాయి:

                        ఈ విషయం మీద పెద్ద పరిశోధనే జరిగింది. చివరకు ఆ పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వారి మెదడులో సెర టోనిన్ ( బ్రెయిన్ న్యూరో ట్రాన్స్మిటార్) స్థాయి సాధారణ వ్యక్తుల సెరటోనిన్ స్థాయితో పోలిస్తే తక్కువగా ఉందని. అలాగే ఆత్మహత్య చేసుకుని మరణించిన వారి మెదడులో సెరటోనిన్ స్థాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వారి సెరటోనిన్ స్థాయి కంటే ఇంకా తక్కువగా ఉందని కూడా తేలింది. ఈ హెచ్చు తగ్గులన్ని  మెదడులోని ventro medial pre fontal cortex  లో జరుగుతాయి. అయితే ఎటువంటి మానసిక వత్తిడి లేకుండా కేవలం సెరటోనిన్ స్థాయి తగ్గిపోయినా కూడా ఆత్మహత్యా స్వభావం వస్తుందని , ఇది వారసత్వం గా సంక్రమిస్తుందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. ఆత్మహత్యల గురించి మీడియా లో పదే పదే చూపించడం కూడా సాధారణ వ్యక్తిలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరణ కలిగిస్తుందని చాలా పరిశోధనలు చెపుతున్నాయి.


    ఆత్మహత్యలను ఎలా నివారించవచ్చు ???

                

                 









             



                      సమస్యని పరిష్కరించడం ద్వారా, బాధితులకు మనోనిబ్బరం కలిగించడం ద్వారా, మానసిక వ్యాధి నిపుణులను సంప్రదించడం ద్వారా, మనస్తత్వశాస్త్ర నిపుణుడిని సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా ఇలాంటి ఆత్మహత్యా భావాలు రాకుండా నివారించ వచ్చు.

    Thursday, February 23, 2012

    మూడు కొత్త ఛుక్ ఛుక్ బండ్లు వస్తున్నాయి, మీ ఊరికి వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి...!!!

                      
                                  మన ఎంపి ల వత్తిడి ఫలితమో లేక మన అదృష్టమో తెలియదు గాని వచ్చే వారం మన రాష్ట్రానికి మూడు  కొత్త రైళ్ళు రాబోతున్నాయి. ఎప్పుడు బీహార్, పశ్చిమ బెంగాల్ వైపు పరిగెత్తే రైళ్ళు ఈ సారి మన వైపు రావడం తెలుగు ప్రజలకు ఆనందం కలిగించే విషయమే...!!! ఇంకెందుకు ఆలస్యం, ఆ రైళ్ళ వివరాలు చుసేయండి.
    1) హౌరా -మైసూరు -హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ :
                                ఈ ట్రైన్ (నెంబర్ : 22817 ,22818 ) 24 ఫిబ్రవరి 2012 నుంచి మొదలవుతుంది. మన రాష్ట్రం లో పలాస, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి , ఏలూరు,విజయవాడ ,రేణిగుంట , మార్గం గుండా వెళ్తుంది. 
    2) షాలిమార్- సికిందరాబాద్- షాలిమార్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్:
                              ఈ రైలు( నెంబర్ :22849 ,22850 ) కూడా 24 ఫిబ్రవరి 2012 నుంచి మొదలవుతుంది. సికిందరాబాద్ నుంచి ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 5 .30 కి బయలుదేరుతుంది. మనరాష్ట్రంలో  ఖాజీపేట, వరంగల్, విజయవాడ, ఏలూరు , రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం,పలాస , సోంపేట స్టేషన్ లలో ఆగుతుంది.
    ౩) మంగుళూరు  - సంత్రగాచి  - మంగుళూరు వీక్లీ ఎక్స్ ప్రెస్ :
                              ఈ రైలు (నెంబర్ : 22851 ,22852 ) ఫిబ్రవరి 25వతేదీ నుంచి మొదలవుతుంది. మనరాష్ట్రం లో ఈ రైలు సోంపేట, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి ,ఏలూరు, విజయవాడ, ఒంగోలు,నెల్లూరు, గూడూర్, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఆగుతుంది. మన రాష్ట్రంగుండా  ఈ రైలు ఆదివారం మరియు  సోమవారం లలో వెళుతుంది.
                              అయితే ఈ రైళ్ళు అన్ని కోస్తా ప్రాంతం నుంచే ప్రయాణించడం గమనార్హం. రాష్ట్రం లో మిగిలిన ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్ళు తీసుకురావడానికి మన ఎంపి లు కృషి చేస్తారని ఆశిద్దాం.
                             





    Thursday, February 16, 2012

    చాకోలేట్లతో అద్భుతమయిన రూపాలు ( చిత్రాలతో సహా)...!!! కరిగి పోక ముందే ఒక లుక్కెయ్యండి...!!!

    1)మీ స్వీట్ హార్ట్ ని మీకు నచ్చిన వారికి ఇచ్చేయండి....!!! 





    2) చాకొలేట్ పనిముట్లు : 




    3) చాకోలేట్లతో రాతి నిర్మాణాలు :




     4) కుక్కలే కాదు మనుషులు కుడా బూట్లను కూడా తినేయొచ్చు:



    5) తను కరిగిపోక ముందే తినేయాలి మరి ....!!!




    6) గోర్లు కత్తిరించుకునే సెట్:




    7) చాకొలేట్ తో ఇలా చెక్ పెట్టేయోచ్చు :




    8) కెమెరా :



    9) మగ వారికేనా బూట్లు, ఆడవారికోసం హీల్స్ కూడా :



    10) ఆగండి...అయిపోలేదు... చేతికి బేడీలు వేయించుకుని తింటూ ఈ పేజి క్లోజ్ చేయండి:

    Wednesday, February 08, 2012

    సుమ యాంకరింగ్ శృతిమించుతోందా....!!! స్థూలకాయుల మనోభావాలు దెబ్బతింటున్నాయా...!!!

                         
                     తన చలాకీతనంతో, సమయస్ఫూర్తితో, సందర్భోచిత వ్యాఖ్యానంతో, అందరిలో కలిసిపోయి నవ్వులు పూయించే సుమ, యాంకరింగ్ రంగం లోనికి ప్రవేశించే వారికి స్ఫూర్తిగా నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కేరళ నుంచి వచ్చి కూడా తెలుగు భాష మీద పట్టు సాధించి , స్పష్టంగా మాట్లాడుతూ ఇప్పుడున్న తెంగ్లిష్ మాట్లాడే వారందిరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ టి.వి లో స్టార్ మహిళ( 1000 ప్లస్) మరియు జీన్స్ ,మా టివి లో భలేచాన్సులే, జీ తెలుగులో భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, టివి 9 లో పంచావతారం వంటి షోలను అలవోకగా నడిపిస్తున్న సుమ యాంకరింగ్ ఈ మధ్య కొంచెం శృతి మించుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆవిడ వీరాభిమాని అయిన మా ఆవిడ కూడా నాతో ఈ మాట అనడం నన్ను ఈ టపా రాయడానికి ప్రేరేపించింది.
                        అసలు విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా ఒక ఛానల్లో ప్రసారం అవుతున్న పాము నిచ్చెన ఆటలో సుమగారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందులో జంబో అనే క్యారెక్టర్ పట్ల సుమ గారు, ఆ ఆటలో పాల్గొనడానికి వచ్చిన సెలెబ్రిటిలు వ్యవహరించే తీరు స్థూలకాయులను మనోవేదనకు గురిచేసాలా ఉందని అనిపిస్తుంది. జంబో అని పిలవడం ఒక ఎత్తయితే, చీటికి మాటికి జంబో స్థూలకాయాన్ని ఉద్దేశించి సుమగారు చేసే వ్యాఖ్యలు ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. జంబోని కాలితో తన్నడం, నేల మీద పడుకో పెట్టించి సెట్లో ఉన్న వాళ్ళందరితో పైకి లేపించడం, జంబో నీ బరువెంత అని మళ్లీ మళ్లీ అడగటం, జంబోని వంగోమని అడిగి( ఒక ఆటలో భాగంగా) వంగోబోయే లోపు పాంట్ చిరిగినట్టు పర్ మని శబ్దం చేయడం వంటి సంఘటనలు కేవలం మచ్చుకు మాత్రమే. స్థూలకాయమ్ ఉన్నవాళ్ళు కామెడి చేయడం ఇంతకుముందు చాలా చిత్రాలలో ఉన్నప్పటికీ టెలివిజన్ చరిత్రలో ఇదే ప్రధమం అనుకుంటా.
                        ఏ సందర్భాన్నయినా తన మాటల చాతుర్యంతో పండించే సుమ ఇలా జంబో మీద ఎందుకు పడిందో అర్ధం కావడం లేదు. ఏదేమయినా ఆంధ్రుల అభిమాన యాంకర్ గా  పేరొందిన సుమ ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మరింత ఆదరాభిమానాలు పొందుతుందని నా అభిప్రాయం.

    Monday, February 06, 2012

    MRP కే మద్యం....మందు బాబులకు హాంగ్ ఓవర్ తంటా...!!!


                        ఈ మధ్య కాలంలో నేను ఒక విచిత్రమయిన పరిస్థితిని చూస్తున్నాను . అదేమిటంటే నా దగ్గరకు వచ్చే చాలా మంది  పేషెంట్స్ హాంగ్ఓవర్ అని కంప్లైంట్  చేస్తున్నారు. కారణం ఏమిటా అని ఆరా తీస్తే  ACB దాడులకు భయపడి మద్యం సిండికేట్లు మద్యాన్ని MRP  ధరకే అమ్ముతున్నారని తెలిసింది. ఇంకేముంది... అప్పటివరకు 120/130  రూపాయలకు కొన్న క్వార్టర్ బాటిల్ కేవలం 80 రూపాయలకే లభిస్తుండే సరికి మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రోజూ రెండు క్వార్టర్లు పీకే వారు అదే డబ్బులతో మూడు క్వార్టర్లు పీకటం మొదలెట్టారు. అలా హాంగ్ఓవర్ బారిన పడేవాళ్ళు ఎక్కువయ్యారు.( నా బిజినెస్ కూడా బాగా పెరిగింది లెండి...!!!). అందుకే హాంగ్ ఓవర్ గురించి బ్లాగర్లకు చెబుదామనిపించి ఈ టపా రాస్తున్నాను.
    హాంగ్ ఓవర్ ఎలా వస్తుంది...? లక్షణాలు ఎలా ఉంటాయి?
                  హాంగ్ఓవర్ అనేది అధిక మొత్తంలో మద్యము తీసుకున్న తరువాత మందుబాబులు అనుభవించే ఒక పరిస్థితి . వాస్తవంగా మద్యం ప్రభావం నుంచి మనిషి బయటకు వస్తున్నపుడు ఈ స్థితి వస్తుంది. చాలా మంది నిపుణులు మద్యం తయారు చేసేటపుడు అందులో కలుపబడే కొన్ని రకాల పదార్ధాల వలన హాంగ్ఓవర్ వస్తుందని చెపుతారు. మద్యంలో కలుపబడే ఈ పదార్ధాలను కాంజీనేర్స్ 
    Congeners ) అంటారు


    హాంగ్ఓవర్ ని ఎలా తగ్గించు కోవచ్చు...?
                  పురాతన కాలంలో హాంగ్ఓవర్ ని తగ్గించడానికి మిర్ అనే ఒక రసాయనం మరియు పక్షుల యొక్క ముక్కు ని మెత్తని మిశ్రమంగా కలిపి ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి మిశ్రమాన్ని వాడటం మంచిది కాదని నిపుణులు తేల్చేసారు. హాంగ్ఓవర్ కి చికిత్స లేదు కాబట్టి నివారణ ఒక్కటే మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు. అధిక శాతం ఆల్కహాల్ కలిగి వున్న విస్కీ మరియు బ్రాందీలను సేవించడం మాని తక్కువ మోతాదులో ఆల్కహాల్ వుండే వోడ్కా మరియు జిన్ వంటివి సేవించడం ద్వారా ఈ హాంగ్ఓవర్ బారినుండి బయట పడవచ్చు. రసాయన పదార్ధాలు కలిపిన అన్ని రకాల మద్య పానీయాలకు దూరంగా ఉంటే మంచిది. సాధారణంగా రెడ్ వైన్ అధికంగా సేవించడం ద్వారా వచ్చే హాంగ్ఓవర్ చాలా దారుణంగా ఉంటుంది. ఇలా అధిక మొత్తంలో మద్యం సేవించి హాంగ్ఓవర్ వచ్చిన వాళ్ళు తరువాత రోజు అధిక కోపంతోనునీరసించి పోయి వుంటారు.
                 కాబట్టి మద్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి కానీ మద్యం మనల్ని ఎంజాయ్ చేయకుండా చూసుకోవడం మంచిది. అంతే కదండీ....!!!!

    Wednesday, February 01, 2012

    మనకు తెలియని ఆసక్తికర నిజాలు-- నాల్గవ భాగం

    మరిన్ని ఆసక్తికకర నిజాలతో మరో టపా మీ ముందుకు వచ్చిందండీ....
    ఇక ఆలస్యం దేనికి...చదివేయండి...!!!
    1. గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకానికి కూడా ఒక రికార్డు ఉందంట... అదేంటో తెలుసండీ...గ్రంధాలయాలనుంచి అత్యధికంగా, అతి తరచుగా దొంగతనం చేయబడే పుస్తకం ఇదేనటండోయ్...!!!
    2. తేలు మీద కొంచెం అల్కాహాలు వేస్తే , వెంటనే పిచ్చెక్కి దాని కొండె తో అదే కరుచుకుని చనిపోతుందట...!!! ఈ సారి తేలు కనిపిస్తే కర్రతో కొట్టకుండా కొంచెం ఆల్కహాల్ తో కొడతారు కదూ...!!!
    3. వ్యోమగాములు అంతరిక్షం లోనికి వెళ్లేముందు బీన్స్ తినడం నిషేధం అట....ఎందుకంటారా... స్పేస్ సూట్ లో గ్యాస్ వదిలితే అది పాడవుతుందట...!!! 
    4. చాక్లెట్లు కుక్కల నాడీ వ్యవస్థమీద మరియు హృదయం మీద ప్రభావం చూపిస్తాయట. ఒక చిన్న సైజు కుక్కని చంపడానికి కేవలం కొన్ని ఔన్సుల చాకొలేట్ సరిపోతుంది.
    5. మన జీర్ణాశయం లో ప్రతి రెండు వారాలకొక సారి కొత్త మ్యూకస్ పొర తయారవుతుంది.ఎందుకంటే ఆహారం జీర్ణం అయే ప్రక్రియలో మ్యూకస్ పొర పాడవుతుంది.
    6. అగ్గిపుల్ల కంటే సిగరెట్ లైటర్ ని ముందు కనిపెట్టారట...!!!
    7. ఆవుని మెట్లు  ఎక్కించవచ్చు కానీ మెట్ల మీదుగా కిందకి దింపడం అసాధ్యమట...!!!
    8. తెలివయిన వ్యక్తుల వెంట్రుకలలో జింక్ మరియు కాపర్ పాళ్ళు అధికంగా ఉంటాయట...!!!
    9. చిమ్మటలు/ పట్టు పురుగులు భూకంపం వచ్చినపుడు పైకి ఎగరలేవట...!!!
    10. అంటార్కిటికా లో ఇప్పటివరకు నమోదయిన అత్యధిక ఉష్ట్నోగ్రత 3 డిగ్రీల ఫారెన్ హీట్ మాత్రమేనట...!!!  
    మరికొన్ని ఆసక్తికర నిజాలతో మరో టపాలో కలుద్దాం....!!!

    Tuesday, January 31, 2012

    2040 లో 50 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారతదేశ చిత్ర పటం... అవుట్ లుక్ పత్రిక ఆసక్తికర కథనం...!!!



                    
            1953 లో ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అప్పట్లో మన దేశంలోని రాష్ట్రాలను పునర్విభజన చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంది. 14 రాష్ట్రాలను 9 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి ఈ కమిషన్ 38,000 మైళ్ళ దూరం ప్రయాణించి, 104 ప్రాంతాలను పర్యటించి దాదాపు 1,50,000 డాక్యుమెంట్లను పరిశీలించింది. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితులతో పుట్టుకొస్తున్న కొత్త కొత్త రాష్ట్రాల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అవుట్ లుక్ పత్రిక న్యూస్ రూం లో కొత్త రాష్ట్రాలతో భారత దేశ చిత్రపటాన్ని తయారు చేయాలనే ఒక మంచి ప్రయత్నం జరిగింది. అవుట్ లుక్ పత్రిక వాళ్ళు భాషా పరంగా, సంస్కృతి పరంగా, అలాగే ఆయా రాష్ట్రాల భౌగోళిక స్వరూపం దృష్ట్యా  ఈ రాష్ట్రాలను విభజించడం జరిగింది. ఇది కేవలం ఊహాజనితము మాత్రమే అని ఒక రాష్ట్రాన్ని విడగొట్టమని కాని లేదా కలిపి ఉంచమని చెప్పడానికి కాదని ఆ పత్రికలో పేర్కొన్నారు. 
         
    ఈ విషయం పైన పూర్తి సమాచారం కోసం ఈ లింకుని నొక్కండి...Out Look India Website.http://www.outlookindia.com/article.aspx?279691

    Source : Outlook FEB 6th 2012 మాగజైన్

    Tuesday, January 24, 2012

    ప్రపంచంలో అయిదు ఎత్తయిన మానవ నిర్మిత డ్యాములు...!!!

            డ్యాంలను నీటి ప్రవాహాన్ని ఆపి ఆ నీటిని నిలువ చేయడానికి లేదా విద్యుత్ ఉత్పతి చేయడానికి నిర్మిస్తారని మనందరికీ తెలుసు. అయితే ప్రపంచంలో ఎత్తయిన డ్యాంలు ఏవి అనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు...!!! మీకు తెలియదా...??? అయితే ఇవిగోండి, ఆ వివరాలు మీకోసం ...!!!
    1) నూరేక్ డ్యాం, తజికిస్తాన్, ఎత్తు 314 మీటర్లు 
                    దీన్ని వక్ష్ నది మీద మట్టితో నిర్మించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలో అతి ఎత్తయిన డ్యాం. దీని నిర్మాణాన్ని 1961 లో మొదలు పెట్టి 1980 లో పూర్తి చేసారు.అయితే ఇదే నది మీద 334 మీటర్ల ఎత్తులో " రోగున్" అనే పేరుతో మరో డ్యాంని నిర్మిస్తున్నారు. ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే నూరేక్ డ్యాం రెండవ స్థానానికి పడిపోతుంది.


    2) గ్రాండ్ డిక్సేన్స్ డ్యాం, స్విట్జర్లాండ్, ఎత్తు 284 మీటర్లు:
               దీనిని స్విట్జర్లాండ్ లోని డిక్సేన్స్ నది మీద కట్టారు. దీనిని ముఖ్యంగా జల విద్యుత్ తయారు చేయడానికి కట్టారు. ఇది ప్రపంచంలో అతి ఎత్తయిన గ్రావిటీ డ్యాం. అన్ని రకాల డ్యాం కట్టడాలలో చూసుకుంటే యూరోప్లో ఇదే అతి ఎత్తయిన డ్యాం,మరియు ప్రపంచంలో రెండవ అతి ఎత్తయిన డ్యాం.
    3)ఇంగురి డ్యాం, జార్జియా, ఎత్తు 272 మీటర్లు 
               ఈ డ్యాంని జార్జియాలోని జ్వారి పట్టణానికి ఉత్తర దిక్కున ఇంగురి నది మీద నిర్మించారు. ఈ డ్యాం నిర్మాణం పూర్తిగా కాంక్రీటుతో చేసారు. ఈ డ్యాం కూడా జల విద్యుత్ ఉత్పత్తి కోసమే కట్టారు. కాంక్రీటు తో నిర్మించబడిన డ్యాంలలో ఇదే ఎత్తయినది.
    4) వజోంట్ డ్యాం, ఇటలీ, ఎత్తు 262 మీటర్లు.
            ఈ డ్యాం ప్రస్తుతం ఉపయోగంలో లేదు. దీని నిర్మాణం 1959 లో పూర్తయింది. అయితే 1963 లో దీనిని పూర్తి స్థాయిలో నింపే ప్రయత్నంలో మట్టి పెళ్లలు ఊడి పడి వరదలు సంభవించి దాదాపు 2000 మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదానికి ఇంజనీర్ల తప్పిదమే కారణం అని తర్వాత తేల్చారు.2008 లో UNESCO ఈ డ్యాంకి జరిగిన ప్రమాదాన్ని ప్రపంచలోని అయిదవ అతి పెద్ద మానవ తప్పిదం వలన జరిగిన ప్రమాదంగా గుర్తించింది.
     5) తెహ్రి డ్యాం, ఇండియా , ఎత్తు 261 మీటర్లు.
                అవునండీ...!!! మీరు చదివింది నిజమే... ఈ డ్యాం మనదేశంలోనే ఉంది.ఈ డ్యాంని పవిత్ర గంగానదికి ఉపనది అయిన భగీరథ నది పైన  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్మించారు. ఇది కూడా జల విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించారు.
                 ఇవండీ ఎత్తయిన డ్యాంలకు సంబంధించిన విషయాలు. మరిన్ని ఆసక్తికర విషయాలతో మరో టపాలో కలుస్తానండి...

    Friday, January 20, 2012

    అవిభక్త కవలలు ఎలా జన్మిస్తారు...!!!అవిభక్త కవలలు వీణా వాణీ ల భవిష్యత్తు పైన నీలి నీడలు...!!! తప్పు ఎవరిది...??? విశ్లేషణ

                 వీణావాణీల గురించి మన తెలుగు వారందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత 5 -6 సంవత్సరాలుగా మన మీడియాలో అంతగా నానుతున్న అవిభక్త కవలల పేర్లు అవి. తాజాగా ఈ అవిభక్త కవలల మీద నడుస్తున్న చర్చ నన్ను ఈ టపా రాయడానికి ప్రేరేపించింది. 
    అవిభక్త కవలలు ఎలా జన్మిస్తారు?
                   సాధారణంగా స్త్రీలలో విడుదలయిన అండం, పురుషుడి శుక్రకణంతో కలిసి ఫలదీకరణం చెంది పిండంగా ఏర్పడుతుంది. ఈ పిండం నవమాసాలు తల్లి గర్భంలో ఉండి శిశువుగా రూపాంతరం చెందుతుంది. సాధారణంగా ఒక తల్లి గర్భంలో ఒక పిండం మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు రెండు అండాలు రెండు శుక్రకణాలతో ఫలదీకరణం చెంది రెండు పిండాలు ఏర్పడతాయి. మరి కొన్ని సార్లు ఒక పిండం రెండుగా విడిపోయి రెండు వేర్వేరు శిశువులుగా రూపాంతరం చెందుతాయి. ఈ రెండు సందర్భాలలోనూ కవలలు జన్మిస్తారు. మొదటి సందర్భంలో జన్మించిన కవలలు ఒకేవిధంగా ఉండరు. కానీ రెండవ సందర్భంలో జన్మించిన కవలలు ఒకే విధంగా ఉంటారు. అయితే రెండవ సందర్భంలో పిండం సరిగా విభజన జరగక పోవడం వలన కానీ లేదా విభజన జరిగిన తర్వాత తిరిగి పాక్షికంగా అతుక్కోవడం గానీ జరిగినపుడు అవిభక్త కవలు ఏర్పడతారు. సాధారణంగా 2,౦౦,౦౦౦ జననాలలో ఒకరికో ఇద్దరికో ఇలా అవిభక్త కవలలు జన్మిస్తారు. ఇలా జన్మించిన వారిలో దాదాపు సగం మంది చనిపోయి జన్మిస్తారు, మరికొంత మంది పుట్టిన తరువాత మరణిస్తారు. కేవలం 25 % మంది మాత్రమే జీవించగలిగే అవకాశం ఉంటుంది.
    వీణావాణీల గాధ:

                    దాదాపు 8 సంవత్సరాల క్రితం ఈ అవిభక్త కవలలు జన్మించారు. వీళ్ళది వరంగల్ జిల్లాలో ఒక పల్లెటూరు. వీరు జన్మించినపుడు వీరికి ఆపరేషన్ చేయించడానికి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు వీరి తల్లిదండ్రులు. అప్పటికే ఒక అవిభక్త కవలలను విజయవంతం గా విడతీసిన ఘనత అక్కడ అప్పట్లో పనిచేసిన డాక్టర్ నాయుడమ్మ గారికి ఉంది. అయితే వీరికి అన్ని రకాల పరిక్షలు చేసి ఆపరేషన్ చేద్దామనుకునే సమయానికి అప్పటి మీడియా హడావిడి చేయడం వల్ల గానీ, నాయుడమ్మ గారి పదవీ కాలం ముగియడం వల్ల కానీ వీరిని విడతీయలేక పోయారు. తరువాత వీరి తల్లిదండ్రులు వీరిని హైదరాబాద్ లోని నిమ్స్ కి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేయబోయే సమయానికి వీణావాణీల తల్లిదండ్రులు ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టడానికి నిరాకరించే సరికి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇక్కడ తల్లిదండ్రులు నిరాకరించడానికి ముఖ్య కారణం మీడియానే. ఎవరో ఒకరు చనిపోతారంటూ చానళ్ళు చేసిన హడావిడికి తల్లిదండ్రులు భయపడిపోయారు. ఎంతయినా కన్నవారు కదండీ... కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు ఆపరేషన్ కి ఒప్పుకున్నా డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. కారణం కేవలం మీడియానే... చివరకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ గారు వీరికి విదేశాలలో ఆపరేషన్ చేయించడానికి కోటి రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఆయన మరణంతో తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడంతో వారు ఇప్పటివరకు ఆసుపత్రిలోనే ఉన్నారు.
    వీణావాణీల భవిష్యత్తుపైన నీలినీడలు...తప్పు ఎవరిది???
             వీణావాణీల పోషణ పైన అటు తల్లిదండ్రులు ఇటు ప్రభుత్వం ఇద్దరూ లెక్కలు వేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. మన సాంప్రదాయం ప్రకారం పిల్లల్ని కనగానే సరిపోదు. వారి పెంపు భాద్యతలను కూడా చూసుకోవాలి. మాకు పెంచే ఆర్దిక స్తోమత లేదని తల్లిదండ్రులు మీడియా ముఖంగా చెప్పడం మన వ్యవస్థకు అవమానంలా అనిపించింది. ఇక ప్రభుత్వ విషయానికి వస్తే ఇప్పటికయినా సమర్ధమయిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ చేయించడానికి మార్గాలు వెతకాలి. అయితే ఆపరేషన్ విజయవంతం కావాలి, పిల్లలిద్దరూ బతకాలంటే మాత్రం కాస్త కష్ట సాధ్యమయిన పని. అలాంటప్పుడు పిల్లల్ని ప్రభుత్వ ఆశ్రమం లో ఉంచి జీవితాంతం ప్రభుత్వమే కాపాడాలి.

    Thursday, January 19, 2012

    నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు....!!!రాజకీయ నాయకుల సిగ్గులేని తనం పైన నా మనస్సాక్షికి అనిపించిన విషయాలు..

                మన దౌర్భాగ్యం ఏమోగాని పరిపక్వత కలిగిన  రాజకీయ నాయకులను చుద్దాం అంటే మచ్చుకు కుడా కానరారు. కొన్ని రోజులు వాడు అవినీతి చేసాడని వీడు, వీడు  అక్రమాలు చేసాడని వాడు కొట్టుకుంటారు. మరి కొన్ని రోజులు దమ్ముంటే మా ఊర్లో పోటి చెయ్, మా ప్రాంతంలో అడుగు పెట్టు లాంటి వ్యాఖ్యలతో రెచ్చగొట్టుకుంటారు.ఒకడేమో నాలిక కోస్తా అంటే దానికి కౌంటర్ గా మరొకడు పీక కోస్తా అంటాడు. ఒక ఉద్ధండుడెమో పడగొడతా పడగొడతా అని అరుస్తుంటే దీనికి కౌంటర్ గా మరొకడు నిలబెడతా, తొడగొడతా అంటాడు. ఒకడేమో నేను రైతుల కోసమే రాజకీయాలు చేస్తున్నానంటే మరొకడు రైతు "పచ్చ"గా ఉండటానికి ప్రాణాలయినా అర్పిస్తానని ఊదర గొడతారు. మన రొచ్చు రాజకీయాలలో ఇప్పుడు నేను ప్రస్తావించిన విషయాలు కేవలం మచ్చుకు మాత్రమే.
                  అసలు ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నిన్న అపర చాణక్యుడు, ఉద్యోగుల పాలిటి సింహ స్వప్నం, "బీప్" పోటు వీరుడు గా పేరు గాంచిన మన మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక వ్యాఖ్యని చూసి నాకు వొళ్ళు మండింది. తెలుగు జాతికి వన్నెతెచ్చిన మామగారి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టించలేకపోయిన ఆయనగారు మన రాష్ట్రంలో ఉన్న అనుమతి లేని దివంగత ముఖ్యమంత్రి గారి విగ్రహాలను తీయిన్చేస్తాడట. ఏమండీ...!!! అసలు నట సార్వభౌమ రామారావు గారి వర్ధంతి రోజున చేయాల్సిన వ్యాఖ్యలేనా ఇవి. కేంద్రం లో చక్రం తిప్పే బలం ఉన్న నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. పాడిన పాటే పాడరా పాసి పళ్ళ సుబ్బయ్యా అన్నట్లు ఎన్.టి.ఆర్ వర్ధంతి రోజున కూడా దివంగత ముఖ్య మంత్రి విగ్రహాల మీద పడ్డారు ఆ మహానుభావుడు. ఎందుకంటే  ఈయన గారికి దివంగత ముఖ్య మంత్రిని రోజు ఏదో ఒకటి అననిదే నిద్ర కూడా పట్టదు మరి . అసలు ఎన్.టి.ఆర్ కి భారతరత్న రాక పోవడానికి మరియు ఆయన విగ్రహం పార్లమెంటులో లేక పోవడంలో  ప్రధాన పాత్ర ఈయన గారిదేనని ఆయన తోక పత్రిక మరియు ఆ తోక కి తోక అయిన మరో ఛానలు నిన్న చర్చ కుడా నిర్వహించాయిలెండి. జనాలు ఏమనుకుంటారోనన్న భయం ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.
                 ఈ తతంగం కేవలం ఒక రాజకీయ నాయకుడికి మాత్రమే పరిమితం కాదు. అందరూ అందరే...!!! ఒక్క నాయకుడికి కూడా ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదు. ఏదయినా సమస్య వచ్చినపుడు ఒక్కడు కూడా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వరు. ఎంత సేపూ పొద్దున్న లేచి  అవతలి వాడిని ఎంత బాగా అమ్మ నా బూతులు తిడదామా అని మాత్రమే ఆలోచిస్తారు. విద్యుత్ చార్జీల పెంపు సమస్య కాదా నాయనా...??? అకాల వర్షాలతో పంట కోల్పోయిన రైతుల గురించి మీరు ఏం చేసారు. ప్రభుత్వం వాళ్లకు ఎలాగు తీరదు. ఎందు కంటే ఢిల్లీ వెళ్లి అమ్మగారి పాద సేవ లో తరించాలి...లేకుంటే  అమ్మ గారు ఆవలించలేరు...!!! మన రాష్ట్ర పార్టీలకయినా  సిగ్గుండాలి కదా... నలుగురిని వెనకేసుకుని మమ అనిపించడం తప్ప ఎంతమంది చిత్త శుద్ధి తో పని చేస్తున్నారు చెప్పండి.
               వీళ్ళ తీరు మార్చుకోక పోతే పాత ఇంకుడు గుంతలలో కొంతమందిని, బంగాళాఖాతంలో మరి  కొంతమందిని, ఢిల్లీ యమునానదిలో మిలిన వాళ్ళని పాతి పెట్టడం ఖాయం...!!! 

    Wednesday, January 18, 2012

    మనకు తెలియని ఆసక్తికర నిజాలు....!!! -- మూడవ భాగం

                ఇక్కడ రాసిన ఆసక్తికర నిజాలన్నీ మన తెలుగు బ్లాగరుల కోసం అంతర్జాలం నుంచి, టి.వి షోల నుంచి సేకరించినవే. శాస్త్రీయంగా ఋజువు కాబడిన అంశాలనే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. 
    1. ప్రపంచంలో అన్ని ఖండాల పేర్లు  ఏ ఆంగ్ల  అక్షరంతో అయితే మొదలవుతాయో  అదే ఆంగ్ల  అక్షరంతో ముగుస్తాయి ( అమెరికా ఖండాన్ని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఉత్తర , దక్షిణ భాగాలుగా పిలుచుకుంటారు) ...!!!
    2. మన శరీరంలో అత్యంత బలమయిన కండరం నాలుక....!!!
    3. పందులు తల పైకి ఎత్తి ఆకాశంలోకి చూడటం అనేది భౌతికంగా అసాధ్యం అయిన పని.
    4. కీబోర్డ్ లో ఒక వరుసలో ఉండే అక్షరాలను ఉపయోగించి వ్రాయగలిగిన అతి పొడవయిన పదం TYPEWRITER ....!!!
    5. మీ మోచేతిని మీరు కొరుక్కోవడం అనేది అసాధ్యమయిన పని...!!!!
    6. ధృవపు ఎలుగుబంట్లు అన్నీ ఎడమ చేతి వాటం కలిగి ఉంటాయట...!!!
    7. 111,111,111 x 111,111,111 = 12,345,678,987,654,321 ....!!!!
    8. మీరు ఏదయినా పార్కు లో రెండు కాళ్ళు పైకి ఎత్తిన గుర్రం మీద మనిషి విగ్రహాన్ని చూస్తే ఆ వ్యక్తి యుద్ధం లో చనిపోయినట్లు లెక్కట...!!!
    9. మీ అంతట మీరు శ్వాస ఆపుకుని ఆత్మహత్య చేసుకోవడం అనేది అసంభవం...!!! దయ చేసి ప్రయత్నించకండి...!!!
    10. పెంగ్విన్లకు ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చగలిగే శక్తి ఉందట...!!!
    11. మన సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో సవ్య దిశలో( CLOCK  WISE )తిరిగే గ్రహం వీనస్ మాత్రమే...!!! 
    12. ఈ విషయాలన్నీ చదివిన వాళ్ళలో 90 శాతం మంది వారి మోచేతిని కోరుక్కోవడానికి ప్రయత్నిస్తారట....!!!!
     మరి కొన్ని ఆసక్తికర అంశాల కోసం మరొక టపా కోసం ఎదురు చూడండి...!!!

    Monday, January 16, 2012

    చిన్నప్పటి చిలిపి పనులు / అమ్మమ్మ జ్ఞాపకాలు...!!!

                        అమ్మమ్మ సుదూర లోకాలకు వెళ్లి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా,భాస్కర రామి రెడ్డి గారు ప్రచురించిన కుసుమాంజలి పత్రికకు మరింత ఆదరణ లభిస్తుందని ఆశిస్తూ మా అమ్మమ్మ తో కలిసి నేను చిన్నపుడు చేసిన తులిపి పనులను ఇక్కడ సరదాకి వివరిస్తున్నా...!!!
                       మా తాత గారి పేరు వెంకురెడ్డి , ఉపాధ్యాయుడిగా పనిచేసేవేవారు. వెంకురెడ్డి మాస్టర్ గారంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో గౌరవం మరియు భక్తి కూడా. ఉపాధ్యాయ వృత్తి తో పాటు మా తాత గారు ఆయుర్వేద వైద్యం కూడా చేసే వారు. ఇక మా అమ్మమ్మ విషయానికి వస్తే పేరు కుసుమాంబ అప్పట్లో తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నా, కొంచెం కష్ట పడితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నాకూడా మా అమ్మమ్మ వాళ్ళ నాన్న గారు తన దగ్గరే శిష్యరికం చేస్తున్న మా తాతయ్యకి  మా అమ్మమ్మనిచ్చి పెళ్లి చేయడానికే మొగ్గు చూపారు. అలా మా అమ్మమ్మ తాతయ్య ఒక్కటయ్యారు. మా అమ్మమ్మ తాతయ్య లకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నేను చిన్న కూతురికి మొదటి సంతానం గా జన్మించాను.నేను పుట్టింది ప్రకాశం జిల్లా లోని వెలిగండ్ల మండలం లో ఉన్న జిల్లెల్లపాడు గ్రామం లో. పుట్టటమయితే మా అమ్మకి పుట్టాను కాని చిన్న తనం నుంచి నాకు అన్నీ మా అమ్మమ్మే. ఊహ తెలిసిన దగ్గరినుండి నేను అమ్మమ్మ దగ్గరే పెరగటం వల్లనో ఏమో కానీ మా అమ్మమ్మ  గారి ని నేను అమ్మ అని మాత్రమే పిలుస్తాను. అప్పుడప్పుడు నన్ను చూడటానికి మా అమ్మ వచ్చేది. నాకు ఏదయినా అవసరం వచ్చి అమ్మా అని పిలిస్తే ఇద్దరూ పలికేవారు. అప్పుడు నాకు చాలా ఆనందం గా అనిపించేది, ఇద్దరు అమ్మలు ఉన్నారని.
                            చిన్న తనం నుంచి నా మీద మా అమ్మమ్మ కు ప్రత్యేకమయిన అభిమానం. నా మీద ఈగ కూడా వాలనిచ్చేది కాదు.. చిన్నపుడు నేను వేసినాన్ని తులిపి వేషాలు ఎవరూ వేసి వుండరు. నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నపుడే చిలిపి కృష్ణుడి వేషాలు బాగా వేసేవాడినట. ఒకసారి మా అమ్మమ్మ పూలు తీసుకు రమ్మని 2 రూపాయలు ఇస్తే ఆ రెండు రూపాయలకు బొరుగులు( మరమరాలు ) కొనుక్కుని మా ఊరి పక్కనే ఉన్న బంతి పూల తోటలోకి వెళ్లి బొరుగులు తింటూ పూలు దొంగతనం చేసి ఇంటికి పట్టుకెళ్ళానట . ఇంతకి నేను దొంగతనంగా పూలు తీసుకెళ్ళిన విషయం మా అమ్మమ్మకి ఎలా తెలిసిందా అని అనుకుంటున్నారా...!!!. అసలు నన్ను తీసుకు రమ్మని పంపింది మల్లెపూలకండి, బంతిపూలకు కాదు...!!!!. గట్టిగా దమాయించి అడిగే సరికి నిజం చెప్పేసానట. ఇక చూస్కోండి... మా తాతయ్యకు ఎక్కడ చెప్పిద్దో అని భయం వేసి స్నానాల గది లో దాక్కున్నానట. కానీ మంచి అమ్మమ్మ కదా, మా తాతయ్యకి ఏమి చెప్పలేదులెండి. ఇంకో సారి మా ఇంటి పక్కన ఉండే అమ్మాయి నేను బంక మట్టితో చేసుకున్న ట్రాక్టర్ మీద నీళ్ళు పోసిందని ఆ పిల్ల వీపు విమానం మోత మోగించానట. ఈ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వాళ్ళ నాన్న నా వీపు విమానం మోత మోగించడానికి వస్తే మా అమ్మమ్మ సర్ది చెప్పి ఆయనను పంపించేసిందట.

                     నేను పెరిగింది  పల్లెటూరి వాతావరణం కావడం  తో మా ఊర్లో ఎక్కువ టి.వి లు ఉండేవికావు. నాకు తెలిసి అప్పట్లో కేవలం రెండే టి.వి లు ఉండేవి, నేను సమయానికి ఇంటికి రాక పోతే మా అమ్మమ్మ మరెక్కడా వెతకకుండా నేరుగా ఆ టి.వి లు ఉండే ఇళ్లకే వచ్చేది. ఈ విషయం నాకు బాగా గుర్తు. ప్రతీ  ఆదివారం సాయంత్రం వచ్చే తెలుగు సినిమా , ప్రతి శుక్ర వారం వచ్చే చిత్రలహరి చూడటానికి వచ్చే జనం తో ఆ టి.వి యజమానుల ఇల్లు కిక్కిరిసి పోయేవి. కానీ నాకు మాత్రం చోటు దొరికేది. అదెలాగంటారా...!!! ఏముందండి... మా తాత కొడుకుని తలుపు తియ్యన్డోయ్ అని అరిచి గోల పెట్టేవాడిన ట. ఇంకేముంది తాత కొడుకు అనగానే అందరూ పక పక నవ్వి వాళ్ళ వొళ్ళో కుర్చోబెట్టుకొనే వారు.  
                       ఇక ఊహ తెలిసిన తర్వాత చేసిన అల్లరి పనులకు కూడా అమ్మమ్మ వెనకేసుకుని వచ్చింది. మా తాతయ్య ఉపాధ్యాయ వృత్తి నుంచి విశ్రాంతి తీసుకున్నాక మేము గుంటూరు జిల్లా లోని వినుకొండ ప్రాంతం లో గల గాంధీనగరం అనే గ్రామానికి వలస వచ్చాము. నేను 3 , 4  తరగతులు అదే ఊర్లో చదివాను. ఇక్కడ నా అల్లరి మరీ ఎక్కువ అవడం తో నన్ను హాస్టల్ లో పడేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అలా 5 వ తరగతి తో మొదలయిన నా హాస్టల్ ప్రస్థానం ఎం.బి.బి.ఎస్ అయ్యే వరకు కొనసాగింది. మధ్యలో దసరా , సంక్రాంతి పండుగలకు సెలవులు ఇస్తే బాగా పెరిగిన జుట్టుతో, ఒక పెద్ద మూట మాసిన బట్టలు వేసుకుని నేరుగా మా అమ్మమ్మ దగ్గరికే వెళ్ళేవాడిని. ఇవన్ని తలచుకుంటుంటే ఒక్కోసారి ఆనందం గాను , మరి కొన్ని సార్లు బాధ గాను ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మా అని పిలిస్తే పలకడానికి ఒక అమ్మ మాత్రమే ఉంది.    
                     అమ్మమ్మ జ్ఞాపకాలతో మా మామయ్య తీసుకు వచ్చిన కుసుమాంజలి పత్రిక ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కుసుమాంజలి పత్రిక చూడటానికి ఇక్కడ నొక్కండి!!!!