Monday, January 02, 2012

కల్తీ మద్యం తో మరణాలు ఎందుకు సంభవిస్తాయి? విశ్లేషణ !

              కల్తీ సారా తాగి కృష్ణా జిల్లాలో 20 మంది మృతి.......కల్తీ సారా తాగి పశ్చిమబెంగాల్ లో 170  మంది మృతి..... ఇలాంటి వార్తలు ఈ మధ్య మనం వింటున్నాం...నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2010  లో 1202  మంది కల్తీ సారా తాగి చనిపోగా 2011 లో దాదాపు 900 మంది కల్తీ సారా తాగి మృత్యువాత పడినట్లు అంచనా. కొత్త సంవత్సర సంబరాల్లో అందరూ మునిగితేలుతుండగా వచ్చిన కృష్ణా జిల్లా వార్త ఒక్క సారిగా నా మనసుని కలచి వేసింది. కొత్త సంవత్సరం తొలిరోజంతా ఈ ఘటన మీద విశ్లేషణ చేయగా  అనేక ఆసక్తికర  విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అసలు మన దేశం లోనే ఎందుకు ఎక్కువగా ఈ మరణాలు సంభవిస్తున్నాయి...???
              మనదేశంలో మద్యం కంపెనీలు తయారు చేసే మద్యం మోలాసిస్ (molases ) నుంచి తయారు చేస్తారు. ఈ మొలాసిస్ మనదేశంలో ఎక్కువగా ఉండే చక్కెర కర్మాగారాల నుంచి వ్యర్ధ పదార్ధంగా లభిస్తుంది.ఈ మద్యంలో కిక్ కోసం రెక్టిఫయిడ్ స్పిరిట్ ని కలుపుతారు. ఆ తరువాత ఆ మద్యాన్ని డిస్టిల్లేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇలా తయారు చేయబడిన మద్యాన్ని చట్ట ప్రకారం అమ్ముతారు. ఈ మద్యం విలువ నాటు సారా విలువ తో పోలిస్తే చాలా ఎక్కువ గా ఉంటుంది. భారత దేశంలో 60 శాతం మంది మద్యం ప్రియులు ఈ మద్యాన్ని కొనగలిగే స్థితి లో లేరని విశ్లేషకులు చెబుతున్నారు.
              ఇక నాటు సారా తయారీ విషయానికి వస్తే ఈ మద్యాన్ని తయారు చేయడం చాలా తేలిక. సాధారణం గా ఈ మద్యాన్ని బెల్లం ఊట నుంచి తయారు చేస్తారు.ఇలా తయారు చేసిన మద్యంలో కిక్ కోసం మిథనాల్ లేదా అమ్మోనియం నైట్రేట్ ని కలుపుతారు. ఈ రసాయకాలు చాలా ప్రమాద కరమయినవి. ఒక మనిషి ప్రాణం తీయడానికి 30 మి.లీ మిథనాల్ సరిపోతుందంటే మిథనాల్ ఎంత ప్రమాదకరమయినదో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ మద్యం తయారీలో సుద్ధి చేయడం అనే ప్రక్రియ సరిగా ఉండదు. ఈ నాటు సారా చాలా తక్కువ ధరకు లభిస్తుంది. కొన్ని ప్రదేశాలలో ఈ నాటు సారా తయారి ఒక కుటీర పరిశ్రమ గా వర్దిల్లుతుందంటే మన దేశం లో పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. మేలిమి మద్యం కొనుగోలు చేయలేని పేద ప్రజలు తక్కువ ధరకు లభించే ఈ నాటు సారా  వైపు మొగ్గు చూపుతున్నారు.
              నాటు సారా తయారు చేయడం మనదేశం లో చట్టరీత్యా నేరం. అయితే ఎక్సైజ్ శాఖ కాసుల కక్కుర్తో  లేక ప్రజల లెక్కలేని తనమో గానీ ఎక్కడో ఒక చోట ఈ మద్య తయారీ నిరాటంకం గా జరుగుతూనే ఉంది. ఒక్కో సారి మన ఎక్సైజ్ శాఖ అధికారులు లంచం తీసుకుని పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. మరి కొన్ని సందర్భాలలో దాడులు చేయడానికి  వెళ్ళిన ఎక్సైజ్ శాఖ అధికారులపై నాటు సారా వ్యాపారాలు తిరగబడటం తో మన అధికారులు వెను తిరిగి వస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో నాటుసారా తాగి ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికయినా ప్రజలు, ప్రభుత్వం లో మార్పువచ్చి ఇలాంటి వార్తలు మన చెవిన పడకుండా ఉంటాయని ఆశిద్దాం.

7 comments:

  1. ఇంతకీ మీరున్న ఏజన్సీ ఏరియాలో ఎన్ని బట్టీలున్నయి ? :)

    ReplyDelete
  2. > ఈ మద్యం విలువ నాటు సారా విలువ తో పోలిస్తే చాలా ఎక్కువ గా ఉంటుంది.

    మద్యానికి యే విలువా లేదు మానవజీవనానికి. మీరు వెల అనండి.
    అనేకం యే విలువా లేనివి హెచ్చు వెలకలిగి ఉండవచ్చు.
    అనేకం విలవైనవాటికి సరైన వెలలేకపోవచ్చును.

    ReplyDelete
  3. శ్యామలీయం మాష్టారు,

    ఎక్కడ పద్యం నించి మద్యం లో పడ్డారు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. మనిషి ప్రాణం కంటే కరెన్సీ నోట్ ముఖ్యం అనుకుంటారు వాళ్ళు.

    ReplyDelete
  5. ఎండ్రిన్ కూడా కలుపుతారట కదండీ? ఇదెంత అన్యాయం, కలిపే వాళ్లకి కాక పోయినా, తాగే వాల్లకయినా సిగ్గుండాలి కదండీ..?
    ఇదెంత హేయమైన , నీతి మాలిన, పనికి మాలిన చర్యంటే, మొన్న చనిపోయారని తెలిసినా కూడా నిన్న మైలవరం లో మళ్ళీ తాగేసారు!

    ReplyDelete
  6. పద్యంబున నేనుండుదు
    మద్యంబున పడుట స్వప్న మందును గలదే
    హృద్యంబగు నొక చక్కని
    పద్యమునకు సాటి లేదు వసుధఁ జిలేబీ

    ReplyDelete
  7. చాలా బాగా చెప్పారు శ్యామలీయం మాస్టారు గారూ...!!!

    ReplyDelete